మెదక్ కలెక్టరేట్: అకాలవర్షంతో తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో తడిసిన సుమారు 4 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులను తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో 62,103 మంది రైతుల నుంచి 2,85,054.080 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. 30 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ ముగిసిందన్నారు. రైతులు ధాన్యం సమస్యలపై 9391942254 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మంత్రిని కలిసిన రైతు
కౌడిపల్లి(నర్సాపూర్): కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను గురువారం భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మండలంలోని మహమ్మద్నగర్కు చెందిన టమాట రైతు మహిపాల్రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఈసందర్భంగా వ్యవసాయ రంగ అభివృద్ధితో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. ఎరువుల ధర తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అన్లోడింగ్ వేగవంతం
కొల్చారం(నర్సాపూర్): రైస్ మిల్లులకు ధాన్యం లోడుతో వచ్చిన లారీల అన్లోడింగ్ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు. గురువారం మండలంలోని వరిగుంతం శివారులోని రైస్ మిల్లును సందర్శించారు. గోదాంలో అన్లోడింగ్ చేసే సమయాన్ని రాత్రి 10 గంటల వరకు చేపట్టాలని ఆదేశించారు. ఖాళీ అయిన లారీలను అవసరమైన కొనుగోలు కేంద్రాలకు వెళ్లేలా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
పెండింగ్ కేసులు
పరిష్కరించండి
శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాల్లో నేరాల నియంత్రణకు కృషి చేయాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం శివ్వంపేట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, పీఎస్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు గోదాంలు, రైస్మిల్స్కు తరలింపులో ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మధుకర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
‘ఉపాధి కూలి పెంచాలి’
కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలి రూ.800కు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. గురువారం కౌడిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వీబీజీ రాంజీ పథకాన్ని రద్దుచేసి ఎంఎన్ఆర్ఈజీఎస్ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో రోజూ రెండు పూటల కూలీల హాజరు ఫొటోతీసే విధానాన్ని సైతం రద్దు చేయాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు ప్రతిరోజు రూ. 800 గిట్టుబాటు కూలీ చెల్లించాలన్నారు. ఈసందర్భంగా మండల వ్యవసాయ కార్మిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కోషాధికారి నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.


