కొనుగోలు కేంద్రాల్లోతడిసిముద్దయిన ధాన్యం తీవ్రంగా నష్టపోయిన రైతులు పలుచోట్ల నేలవాలిన విద్యుత్ స్తంభాలు
వర్షార్పణం
అకాల వర్షం అతలాకుతలం చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. రైతుల రెక్కల కష్టం వర్షార్పణం అయింది. కాంటాలు కాక, రైస్ మిల్లులకు పంపేందుకు లారీలు రాక, నెల రోజులుగా అష్టకష్టాలు పడుతున్న అన్నదాతకు చివరికి తీరని నష్టం మిగిలింది. కొనుగోళ్లలో జాప్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలవాలగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
– మెదక్జోన్/కొల్చారం/నర్సాపూర్రూరల్/శివ్వంపేట/వెల్దుర్తి(తూప్రాన్):
వెల్దుర్తి: కొనుగోలు కేంద్రంలో నిలిచిన వర్షపు నీరు
జిల్లాలోని మెదక్, శివ్వంపేట, నిజాంపేట, కొల్చారం, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్, తూప్రాన్, వెల్దుర్తి, హవేళిఘణాపూర్, రామాయంపేట తదితర మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. నెలరోజులుగా ధాన్యం తరలించాలని మొరపెట్టుకుంటున్నా, అధికారులు రేపు, మాపు అంటూ కాలయాపన చేశారని మండిపడ్డారు. ముందే లారీలు తెప్పించి ఉంటే తమకు ఈ గోస పట్టేది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో 34.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా చిలప్చెడ్ మండలంలో 68.8 ఎం.ఎం నమోదు కాగా, అతి తక్కువగా హవేళిఘణాపూర్ మండలంలో 18 ఎం.ఎం వర్షం కురిసింది.


