కొల్చారం(నర్సాపూర్): పంట మార్పిడితో రైతులకు మేలు చేకూరుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ ప్రమీల సూచించారు. శనివారం మండల పరిధి సంగాయిపేట గ్రామంలో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ప్రమీల మాట్లాడుతూ.. వివిధ పంటలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. ముఖ్యంగా వరి నారుమాడిలో యాజమాన్యం, నీటి యాజమాన్యంపై రైతులకు తెలిపారు. పత్తి, మొక్కజొన్న పంటల్లో వచ్చే చీడపీడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పద్ధతిని పాటించాలన్నారు. పచ్చి రొట్టె ఎరువులు జనుము, జీలుగ వంటి విత్తనాలను రైతు తన పొలంలో ఒక మడిలోనైనా పండించి దానిని రాబోయే పంట కాలానికి విత్తనంగా ఉపయోగించాలన్నారు. పంట మార్పిడి చేయాలన్న కోతుల బెడద వల్ల ముందడుగు వేయలేకపోతున్నామని రైతులు శాస్త్రవేత్త దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ కాంతమ్మ, ఎఫ్పీఓ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఏఓ రాజశేఖర్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.


