కౌడిపల్లి(నర్సాపూర్): ధాన్యం కొనుగోలు చేయా లని డిమాండ్ చేస్తూ బుధవారం మండలంలోని కొట్టాల, వెల్మకన్న గ్రామాలకు చెందిన రైతులు మండలంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెలరోజులు అవుతున్నా, ఇప్పటివరకు ధాన్యం తూకం వేయడం లేదన్నారు. తూకం వేసిన ధాన్యం లోడింగ్ చేయడం లేదని ఆగ్రహించారు. ఎస్ఐ అమరేందర్రెడ్డి, ఆర్ఐ విజయలక్ష్మి రైతులు వద్దకు రావడంతో వాగ్వాదానికి దిగారు. కాగా అధికారులు సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్, నాయకులు రమేశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి రైతులు పాల్గొన్నారు.
కోమటిపల్లిలో..
రామాయంపేట(మెదక్): కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం రామాయంపేట– దౌల్తాబా ద్ రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్రంలో ఆరు లోడ్లకు సరిపడా ధాన్యం సంచులుండగా, లారీలు సక్రమంగా రావడం లేదన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాచారం అందుకున్న సీఐ సైదా వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు.


