రైతులతో పేట కొనుగోలు కేంద్రం కిటకిట
పెద్దశంకరంపేట(మెదక్): జొన్న రైతులకు మంచి రోజులొచ్చాయి. అకాల వర్షాలతో నష్టపోయిన వా రిని ప్రభుత్వం ఆదుకునేందు కు ముందుకు వచ్చింది. జిల్లావ్యాప్తంగా దాదాపు 6,200 ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేశారు. పెద్దశంకరంపేట వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలోని రేగోడ్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్ పరిధిలో అత్యధికంగా జొన్న సాగు చేస్తారు. గత మూడేళ్లుగా పెద్దశంకరంపేటలో మార్క్ఫెడ్ ద్వారా జొన్నలను సేకరిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో జొన్నలకు రూ.2,600 నుంచి 2,800 వరకు ధర లభిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.3,180గా నిర్ణయించారు. ఇప్పటివరకు 210 మంది రైతులు దాదాపు 7 వేల క్వింటాళ్ల జొన్నలను పేట కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. యాసంగి సీజన్లో వ్యవసాయ అధికారులు నమోదు చేసుకున్న రైతుల జాబితా ఆధారంగా జొన్నలు సేకరిస్తున్నారు. ఇటీవలే రేగోడ్, అల్లాదుర్గం మండలాల్లోనూ జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పేట పీఏసీఎస్ సీఈఓ రవీందర్ సూచించారు.