మంచిర్యాలక్రైం: మంచిర్యాల నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి పది గంటలు దాటిందంటే చాలు బహిరంగ బార్ను తలపిస్తుంది. హెలిప్యాడ్ స్థలంలో కూర్చుని మద్యం సేవించి అల్లరి చేస్తుంటారు. అక్కడే బీరు సీసాలు పగులగొట్టి పడేస్తుంటారు. మద్యంమత్తులో డిగ్రీ కళాశాల గదుల్లోకి రాళ్లు విసరడం, కిటికీల అద్దాలు పగులగొట్టిన దాఖలాలు ఉన్నాయి. ఎవరైనా మైదానికి వెళ్తే వారితో గొడవకు దిగుతున్నారు. స్థానికులు డయల్ 100కు కాల్ చేస్తే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ పోలీసులు వచ్చేసరికి మందుబాబులు అక్కడి నుంచి పారిపోవడం, పోలీసులను మేనేజ్ చేయడం చేస్తున్నారనే ఆరోపణలున్నా యి. నగరంలోని కాలేజీ రోడ్, గోదావరి సమీపంలో, గ్రీన్సిటీ అండాలమ్మ కాలనీ, కలెక్టరేట్ సమీపంలో, హైటెక్ సిటీ, ఏసీసీ క్వారీ రోడ్, బైపాస్ రోడ్డు ప్రాంతాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. ప్రతీ నెల పోలీసు కమిషనర్ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, డ్రోన్, డీజేల వినియోగంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ప్రకటన చేస్తుంటారు. కానీ అవేవీ నగరంలో అమలుకు నో చుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని చోట్ల బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై పో లీసులు లాఠీ ఝళిపిస్తున్నారు. అయిన మందుబా బుల్లో మార్పు రావడం లేదు. మద్యం సేవిస్తూ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న వారిపై కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.
పక్కనే బాలికల వసతిగృహం
డిగ్రీ కళాశాల మైదానాన్ని ఆనుకుని బాలికల వసతి గృహం ఉంది. మైదానానికి, వసతిగృహానికి మధ్య ఎలాంటి ప్రహరీ లేదు. మందుబాబులు హాస్టల్కు అతి సమీపంలో అర్ధరాత్రి వరకు మద్యం సేవించి మత్తులో అరుపులు, కేకలు వేస్తుండడంతో బాలికలు భయపడుతున్నారని హాస్టల్ నిర్వాహకులు పలుమార్లు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. డిగ్రీ కళాశాల మైదానం అన్ని విధాలా అనుకూలంగా ఉండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు, మహిళలు, వృద్ధులు వాకింగ్, జాగింగ్, క్రీడాకారులు, కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులు సాధన కోసం వస్తుంటారు. మందుబాబుల చేష్టల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పగిలిపోయిన సీస ముక్కలను ఏరివేస్తుంటామని వాకర్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.
ప్రజలకు ఇబ్బంది..
డిగ్రీ కాలేజీ గ్రౌండ్ను ఆనుకుని గౌతమేశ్వర కాలనీ ఉంటుంది. గౌతమేశ్వర కాలనీ నుంచే గ్రౌండ్లోకి వెళ్లాలి. మద్యం సేవించిన వారు అర్ధరాత్రి వరకు రోడ్డు నుంచే వెళ్తూ అల్లరి చేస్తుంటారు. మద్యంమత్తులో గొడవకు దిగుతున్నారు. రాత్రి 10గంటలు దాటిందంటే గ్రౌండ్ మందుబాబులదే. ప్రజలు గ్రౌండ్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. – రాంరెడ్డి,
గౌతమేశ్వరకాలని, వాకర్స్, మంచిర్యాల
ఒక్క కాల్ చేయండి..
రాత్రివేళ గ్రౌండ్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా మద్యం సేవించే వారిపై 100 డయల్కు కాల్ చేయండి ఐదు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుంటారు. జిల్లా కేంద్రంలో 24గంటలు బ్లూ కోల్ట్స్ మూడు టీములు, ఒక పెట్రో కార్ సిబ్బంది తిరుగుతున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.
– ప్రమోద్రావు, సీఐ, మంచిర్యాల


