నెన్నెల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న రీ సర్వే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చిన్నవెంకటాపూర్లో రీ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సమక్షంలోనే అభ్యంతరాలను పరిశీలించాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తరగతి గదులు పరిశీలించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ యజాస్, సర్పంచ్ భాస్కర్ పాల్గొన్నారు. కాగా, చిన్నవెంకటాపూర్ దారి బురదగా మారి వాహనం వెళ్లలేకపోవడంతో కలెక్టర్ స్థానికుల సాయంతో మోటార్సైకిల్పై చేరుకున్నారు.
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: యువ పారిశ్రామికవేత్తల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల ఫార్మలైజేషన్ పథకం కింద పెండింగ్లో ఉన్న బ్యాంకు దరఖాస్తులు వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పీఎంఎఫ్ఎంఈ సింగిల్ విండో డ్రైవ్ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. బ్యాంకుల వారీగా జిల్లా స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, ఎల్డీఎం తిరుపతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, అధికారులు అంజయ్య, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారులు పాల్గొన్నారు.


