బాసర నుంచి ఖానాపూర్ వరకు ఘాట్లు సౌకర్యాల కల్పనపై అధికారుల దృష్టి వచ్చే జూన్ వరకు పనులు పూర్తికి సీఎం ఆదేశాలు
బాసర గోదావరి నది
భైంసా: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు–2027ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమా రు 96 పుష్కర ఘాట్లు గుర్తించి, చేపట్టే అభివృద్ధి పనులపై సీఎం రేవంత్రెడ్డి అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే జూన్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి తీరం వెంబడి ఉన్న నిర్మల్ జిల్లాలో బాసరతోపాటు పలు ఆధ్యాత్మిక క్షేత్రాలకు లక్షలాది భక్తులు తరలివస్తారు. బాసర నుంచి ఖానాపూర్ వరకు వరకు ఘాట్ల వరకు పనులు, ఇతర శాశ్వత, తాత్కాలిక సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.
అనుమతులు వచ్చాకే టెండర్ల ఖరారు
ఇప్పటికే వివిధ శాఖలకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించనుంది. ప్రతిపాదనలకు పరిపాలన, ఆర్థిక అనుమతులు వచ్చాకే టెండర్లు ఖరారు చేసి అభివృద్ధి పనులు వేగవంతం చేసే అవకాశం ఉంది. శాశ్వత అభివృద్ధి జరిగితే పర్యాటక రంగానికి, ఆలయాల అభివృద్ధికి, స్థానిక ఉపాధికి ఊతం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
శాశ్వత వసతుల కల్పనే లక్ష్యం
పుష్కరాల కోసమే కాకుండా భవిష్యత్తులో ఉపయోగపడేలా శాశ్వత మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శాశ్వత స్నాన ఘాట్లు, రిటైనింగ్ వాల్స్, మార్పిడి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి వ్యవస్థ, హైమాస్ట్ లైటింగ్, సీసీ రోడ్లు, పార్కింగ్ స్థలాలు, నది తీర రక్షణ పనులు, ఆలయాల సుందరీకరణ పనులు చేపట్టనుంది. అదేవిధంగా ఘాట్ల వద్ద రద్దీ నియంత్రణ, ప్రత్యేక ప్రవేశ–నిష్ట్రమణ మార్గాలు, అత్యవసర రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచడం, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పోలీసు పర్యవేక్షణ, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా, డిజిటల్ సమాచార కేంద్రాలు ఉన్నాయి.


