పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పదో తరగతి, ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అదనపు డీజీపీ మహేష్ భగవత్, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పంచాయతీ, విద్య, వైద్య, పోలీసు, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష పత్రాలు చేరవేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలు, తాగునీరు, మూత్రశాలలు, సరిపడా వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అంజయ్య, జిల్లా విద్యాధికారి యాదయ్య, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
‘పది’ పరీక్షల నిర్వహణపై సమీక్ష
మంచిర్యాలఅగ్రికల్చర్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఈవో యాదయ్యలతో కలిసి మండల విద్యాధికారులు, పర్యవేక్షకలు, రూట్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,703 మంది రెగ్యులర్, 45 మంది అనుత్తీర్ణులైన విద్యార్థులకు పరీక్ష రాయనున్నారని తెలిపారు.


