
గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి
ఉట్నూర్రూరల్: గిరిజనుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. ముందుగా పీవో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ఐటీడీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. 934 ప్రాథమిక పాఠశాలల్లో 12,017 మంది విద్యార్థులు చదువుతుండగా 1,449 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నట్లు తెలిపారు. 133 ఆశ్రమ పాఠశాలల్లో 31,749 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పెంచిన చార్జీల ప్రకారం నూతన ఆహార మెనూ అమలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు చెప్పా రు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మినీ బాలికల గురుకులాలు, నాలుగు ఏకలవ్య పాఠశాలలు (కో–ఎడ్యుకేషన్), ఎనిమిది అప్గ్రేటెడ్ బాలికల జూని యర్ కళాశాలలు, నాలుగు అప్గ్రేటెడ్ జూనియర్ కళాశాలలు, ఒక బాలుర జూనియర్ కళాశాల, ఒక బాలికల జూనియర్ కళాశాల, రెండు మహిళా డిగ్రీ కళాశాలలు, ఒక పురుషుల డిగ్రీ కళాశాల ఉన్నట్లు తెలిపారు. గురుకులాల్లో 11,114 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 32 పీహెచ్సీలు, 186 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలుండగా వీటి ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 42 మందికి చికిత్స అందించినట్లు తెలిపారు. భూ బదలాయింపు చట్టం కింద ఈ సంవత్సరం 25 కేసులు నమోదు చేసి 12 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. మిగతా 13 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. జీసీసీ ద్వారా ఉమ్మడి జిల్లాలో గిరిజన సహకార సంస్థ, ఐటీడీఏ ఆధ్వర్యంలో 17 పెట్రోల్ పంపులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా, మంజూరైన 11 పెట్రోల్ పంపులను ప్రారంభించి నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. మగతా ఆరు పంపులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏవో దామోదరస్వామి, ఏడీఎంహెచ్వో మనోహర్, పీహెచ్వో సందీప్, పీవీటీజీ ఏపీవో మనోహర్, డీపీవో ప్రవీణ్, అధికారులు, సిబ్బంది, ఆశ్రమ, గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి నిరంతర కృషి