
ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని వికాసం పాఠశాల
ఉట్నూర్రూరల్: సమాజంలోని ప్రతీఒక్కరిలో ఏదో ఒక సమాజ సేవ చేయాలనే ఆతృత ఇమిడి ఉంటుంది. సమాజ సేవ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా రాణిస్తుంటారు.. అదే మార్గంలో అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సైతం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన దివ్యాంగ విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఓ పాఠశాలను ఏర్పాటు చేశాడు. భోజనం, వసతి, విద్యను అందిస్తున్నారు. ఆ విద్యా సంస్థ పేరే.. వికాసం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఈ పాఠశాలలో పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా దివ్యాంగ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.
ఇక్కడ చదువుకోవడం ఇష్టం..
వికాసం పాఠశాలలో ఉండి చదువుకోవడం అదృష్టంగా భావిస్తున్న. ఇక్కడ చదువుకోవాలంటే చాలా ఇష్టం.. సార్లు బాగ చూసుకోవడంతో పాటు తమకు అర్థమయ్యే రీతిలో మమ్మల్ని చదివిపిస్తున్నారు. అంతేకాకుండా తమ పనులు తాము చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎవరి తోడు లేకున్నా మా పనులు మేము చేసుకుంటాం.
– టి.హన్మంతు, 7వ తరగతి, అంధ విద్యార్థి సిర్పూర్(యు)
ఇంటికి కూడా వెళ్లం..
ఇంటి కంటే ఇక్కడే మంచిగా అనిపిస్తది. అందరితో కలిసి చదువుకోవడం అన్ని పనులు చేసుకోవడం బాగుంటుంది. సార్లు తమకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధించడం, మంచి భోజనం అందించడం, ఆటలు, పాటలు నేర్పించడం సంతోషాన్ని కలిగిస్తుంది. నేను కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదుగుతా..
– బి.రంజిత్, 8వ తరగతి,
ఉట్నూర్ కొత్తగూడ
అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
దివ్యాంగ విద్యార్థులు కావడంతో వారికి అన్నివసతులు, భోజన సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందిస్తున్నాం. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పాఠశాల గురించి తెలుసుకున్న వారు ఇతర జిల్లాల నుంచి కూడా దివ్యాంగ విద్యార్థులను ఇక్కడ చేర్పిస్తున్నారు. చదువుతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ రాణిస్తున్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయింది.
– రాథోడ్ వికాస్, వికాసం పాఠశాల, ప్రధానోపాధ్యాయుడు
పీవో కర్ణన్ ప్రత్యేక చొరవ...
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కుమురంభీం ప్రాంగణంలో అప్పటి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ప్రత్యేక చొరవతో దివ్యాంగుల కోసం వికాసం పాఠశాలను ఏర్పాటు చేయించాడు. నాలుగు రకాల వైకల్యాలు కలిగిన మొత్తం 142మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ పాఠశాలను 2015 నవంబర్లో హైకోర్టు జడ్జి దిలీప్ జీ బోస్లే చేతుల మీదుగా ప్రారంభించారు.
వైకల్యం గల వారికి..
వికాసం ప్రత్యేక బాలల పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటున్నారు. ఇందులో బుద్ధి మాంద్యం గల విద్యార్థులు 37మంది. బద్దిరులు (చెవిటి, మూగ) 61, అంధులు 29, అంగవైకల్యం కలిగిన వారు 15 మంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.
పాఠశాల ప్రత్యేకత...
ఈ వికాసం పాఠశాలలో దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణన్ ప్రత్యేక బాలల బడిని ఏర్పాటు చేయించారు. ఈ పాఠశాలలో ప్రత్యేకంగా దివ్యాంగులైన పిల్లల కోసం హాస్టల్ వసతి, ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో బోధన, మంచి భోజనం, మినరల్ వాటర్, స్నాక్స్ అందిస్తున్నారు. పిల్లలకు ప్రతి నెల డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. పాఠశాలలో పిల్లల కోసం ఆట స్థలం, ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు. ఈ పాఠశాలలో మొదట 1వ తరగతి నుంచి 5 వరకు నిర్వహించారు. ప్రతీ ఏడాది ఓ తరగతిని పెంచుతూ ప్రస్తుతం 8వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో అంధుల కోసం ప్రత్యేక డార్మెంటరీని ఏర్పాటు చేశారు. దీంతో అంధ విద్యార్థులు వారి పనులు వారే చేసుకుంటారు.
అంధులు స్మార్ట్ కేన్ సాయంతో టాయిలెట్స్కి, తరగతి గదుల్లోకి వెళ్తుంటారు. వీరికి ప్రత్యేకంగా ర్యాంపులు సైతం ఏర్పాటు చేశారు.
క్రీడల్లోనూ ప్రతిభ...
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 13న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని మైదానంలో జరిగిన ఆటల పోటీల్లో రన్నింగ్, షాట్ఫుట్, చెస్, క్యారెం, జావిలింగ్త్రో పోటీల్లో అంధులు, మానసిక వికలాంగ విద్యార్థులు పాల్గొని 18 బహుమతులు గెలుపొందారు. 27న 6వ పారా అథ్లెటిక్ చాంపియన్షిప్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ఆరుగురు విద్యార్థులు సత్తాచాటి బంగారు, సిల్వర్ పతకాలు సాధించారు. అలాగే సైన్స్పేర్ పోటీల్లో సైతం జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు.
ప్రత్యేక సదుపాయాలతో వసతి
చదువుల్లో రాణించేలా బోధన
క్రీడల్లో రాష్ట్రస్థాయిలో రాణింపు
అంధ విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు
పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటున్నారు..
పాఠశాలలో ఉన్న విద్యార్థులంతా అంగవైక్యలం కలిగిన వారే. వారికి చదువంటే చాలా ఇష్టం.. తాము సైగల ద్వారా వారికి విద్యాబోధన చేస్తాం.. మొదట్లో కాస్త కష్టమైన వారికి అర్థమయ్యే రీతిలో విద్యను అందిస్తుండడంతో వారు ఇష్టంగా చదువుకుంటున్నారు. ఆటపాటలు నేర్చుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వీరికి విద్యను అందించడం అదృష్టంగా భావిస్తున్న.
– పావని, ఉపాధ్యాయురాలు

క్రీడల్లో రాణించిన విద్యార్థులను అభినందిస్తున్న పీవో

దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులు



