జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నాబార్డ్ నిధులతో జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పనుల పురోగతిని సమీక్షించారు. అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్లు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, ఇతర మరమ్మతు పనుల స్థితిగతులను తెలుసుకున్నారు. పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రారంభించాల్సిన పనుల వివరాలను అడిగి తెలుసుకుని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, ప్రభుత్వం నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలు, షెడ్యూల్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సమావేశంలో కేజీబీవీల డీజీసీఓ, స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నీట్–పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆగస్టు 30న జిల్లాలో నిర్వహించనున్న నీట్–పీజీ 2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి ఫాతిమా స్కూల్, జేపీఎన్సీఈ, ధర్మాపూర్లోని పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత తదితర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరగనున్నందున అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పరీక్షా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. భద్రత, పర్యవేక్షణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


