● రెండు రైస్మిల్లుల్లో 3.51 లక్షల బస్తాల వ్యత్యాసం
● బాయిలర్ మిల్లులో రూ.31 కోట్లు.. రా రైస్మిల్లులో రూ.21 కోట్లు
ఖిల్లాఘనపురం: మండలంలోని హన్పాడ్ శివారులోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బాయిలర్ రైస్మిల్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రా రైస్మిల్లులో రూ.52 కోట్ల విలువైన ధాన్యం వ్యత్యాసం గుర్తించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం, జిల్లా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం వివిధ సీజన్లలో రెండు మిల్లులకు కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టినట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బాయిలర్ రైస్మిల్లులో 1,49,198 బస్తాలు, విలువ రూ.31 కోట్లు, రా రైస్మిల్లులో 2,01,985 బస్తాలు, విలువ రూ.21 కోట్ల మేర వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. రెండు మిల్లుల్లో కలిపి 3,51,183 బస్తాల ధాన్యం లెక్కల్లో తేడా ఉన్నట్లు తెలిపారు. మిల్లుల యజమానురాలు ఎస్.శ్రీదేవిపై శనివారం ఖిల్లాఘనపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
● వనపర్తి రూరల్ మండలం పెద్దగూడెం శివారు లోని భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లులో 1,03,722 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.14 కోట్లకుపైగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. మిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై వనపర్తి రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.


