మహబూబ్నగర్ క్రైం: రాబోయే అన్ని రకాల పండుగలను ప్రజలు ఐక్యంగా, సామరస్య పూర్వకంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో అన్ని వర్గాలకు పోలీస్ శాఖకు అందించిన సహకారమే రాబోయే పండగల సమయంలోనూ అందించాలని కోరారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులు వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. పండుగలకు డీజే, అధిక శబ్దంతో కూడిన సౌండ్సిస్టంలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అధిక శబ్దం వల్ల గుండె సమస్య రోగులకు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్ ఆర్ఐ కృష్ణయ్య, వీహెచ్పీ అధ్యక్షుడు యాదిరెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు హాది తదితరులు పాల్గొన్నారు.


