ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. జల్లులు పడే అవకాశం ఉంది.
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
● భూభారతి, మీ–సేవ దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో నిర్వహించిన వీసీ లో అడ్డాకల్, భూత్పూర్, మూసాపేట, బాలా నగర్, జడ్చర్ల, చిన్నచింతకుంట, కౌకుంట్ల, గండేడ్ మండలాల్లో ఇసుక తవ్వకాలు, రవాణాపై సమీక్షించారు. ప్రభుత్వ రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు నిర్దేశించిన సమయాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడంతో పాటు వీడియో ఆధారాలను నమోదు చేయాలని సూచించారు.
దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు
భూభారతి, మీ–సేవ పోర్టళ్లలో 60 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లు సకాలంలో అందేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నా రు. ‘ఇందిరమ్మ’ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దరఖాస్తులకు ఎంపీడీఓల ద్వారా యూ నిక్ ఐడీలు కేటాయించి ఆన్లైన్లో కనిపించేలా చూడాలన్నారు. లబ్ధిదారుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలన్నారు.
22ఏ సమస్యలపై దృష్టి
భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22ఏ నిషేధిత జాబితా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ పట్టా, ప్రభుత్వ భూముల వివరాల్లోని వ్యత్యాసాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదించాలన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లతో చేపడుతున్న రీసర్వే పనులు ఆశించినస్థాయిలో ఎందుకు ముందు కు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రజల భూ లావాదేవీలకు రెవెన్యూ ప్రక్రియ అడ్డంకిగా మారకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదనపుకలెక్టర్ హరిప్రియ, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి అశోక్ పాల్గొన్నారు.


