జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అర్హులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) ప్రగతిపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అర్హులు ప్రయోజనాలు కోల్పోకుండా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు, అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యాశాఖ ద్వారా స్కాలర్షిప్లు, ప్రీ–మెట్రిక్, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు, ఉన్నత విద్యకు ఆర్థిక సాయం, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, పోటీ పరీక్షల కోచింగ్ వంటి కార్యక్రమాల అమలుపై అధికారులు వివరించారు. వైద్య, సంక్షేమ, విద్య తదితర శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై సమీక్షించారు. ఎస్డీఎఫ్ కేవలం ఒక శాఖకు పరిమితం కాదని, అన్ని శాఖలు తమ పరిధిలో ఎస్సీలకు కేటాయించిన నిధులు, వ్యయం, లబ్ధిదారుల వివరాలు, పెండింగ్ అంశాలపై స్పష్టమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ నరసింహులు, ఎస్సీ అభివృద్ధి సంస్థ అధికారి సునీత, సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


