స్టేషన్ మహబూబ్నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. రాహుల్గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డీసీసీఆధ్వర్యంలో బుధవారం నగరంలోని అశోక్టాకీస్ చౌరస్తాలోని మహాత్మాగాంధీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల తరఫున పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని మండిపడ్డారు. ప్రజల గొంతును అణచివేయాలని ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, విద్యార్థుల హక్కులు, సామాన్య ప్రజల న్యాయం కోసం రాహుల్గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందన్నారు. నిరసనలో టీజీఎంఎఫ్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి, ప్రధానకార్యదర్శి మిథున్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు వినోద్కుమార్, ఆనంద్గౌడ్, సిరాజ్ఖాద్రీ, పసుల రాజు, అజ్మత్అలీ, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
పాలమూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన


