సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘2006 జూలై 4.. నేను గెలిచిన గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. ఆ రోజు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క.. ఈనాడు మహా వృక్షమైంది. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నిలిపింది. ఈ స్థాయికి ఎదిగానంటే మీరే కారణం. నిధులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. మీకు ప్రాణమిచ్చినా తక్కువే.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలకేంద్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయత కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం ముందుగా అప్పటి ఉమ్మడి మిడ్జిల్ పరిధి, ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆనాటి మిడ్జిల్ మండల పెద్దలు, నాయకులు, ఆత్మీయులు సుమారు 150 మందిని ఆత్మీయంగా పలకరించి.. ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిడ్జిల్ సమీపంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పెద్దఎత్తున సభ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మిడ్జిల్ మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారనేది ఆయన మాటల్లోనే..
మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది..
ఈ మండలాన్ని డిప్యూటీ సీఎం భట్టి దత్తత తీసుకోవాలి
అభివృద్ధి చెందినప్రాంతంగా ప్రభుత్వ లెక్కల్లో చూపెట్టాలి..
ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి సహకారం అందించాలి..
కృతజ్ఞతసభలో సీఎం రేవంత్రెడ్డి
రూ.47.08 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన


