అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చదువుకోని నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బుందులు ఎదురవుతున్నాయి.
97.68 శాతం పంపిణీ పూర్తి
ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు.
ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం
2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక
ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ


