ఉప్పునుంతల: రుణాలు అందజేయడమే కాకుండా విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు సంఘ సభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తున్న ఉప్పునుంతల పీఏసీఎస్ సేవలు అభినందనీయమని తెలంగాణ సహకార శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణ అన్నారు. శుక్రవారం ఉప్పు నుంతల పీఏసీఎస్లో నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వాటిలో 311 సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ)గా ఎంపికై నట్లు తెలిపారు. వాటిలో నాగర్కర్నూల్ జిల్లాలో 16 సంఘాలు ఎఫ్పీఓకు ఎంపిక కాగా ఉప్పునుంతల పీఏసీఎస్ మొదటి స్థానంలో నిలువగా ప్రశంసించారు. కొత్తగా వేరుశెనగ డికార్టికేటర్ ఏర్పాటుచేయడం, వెయిట్ బ్రిడ్జి, డ్రోన్ సేవలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ పంట రుణాలతోపాటు ధీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తూ రైతుల సంక్షేమానికి వినూత్న సేవలు అందిస్తున్న ఉప్పునుంతల సహకార సంఘ పాలకవర్గం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నాగర్కర్నూల్ డీసీఓ రఘునాథ్ మాట్లాడుతూ..ఎఫ్పీఓల ద్వార రైతులకు అందే ప్రయోజనాలు, ఇతర సేవల ను వివరించారు. బిజినెస్ డెవలఫ్మెంట్ ప్లాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేరుశెనగ డికార్టికేటర్ వినియోగంతో రైతులకు కలిగే ప్రయోజనాలు, విలువ ఆధారిత సేవలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు వారు పీఏఎస్ ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమలంలో జిల్లా సంయుక్త రిజిస్ట్రార్ శ్రీమతి పరిమిళ, సూపరింటెండెంట్ మధురావు, పీఏసీఎస్ చైర్మన్ మడ్డు నరేందర్రెడ్డి, మాజీ చైర్మన్ సత్తు భూపాల్రావు, సంఘ డైరెక్టర్లు సాయిబాబు, నారాయణ్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.


