ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని గణపసముద్రం రిజర్వాయర్లో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్ కట్టకు ఎత్తుకు 15 రెట్ల దూరంలో మట్టి తవ్వకాలు చేపట్టాలని నిబంధనలు ఉన్నప్పటికి ఏ అధికారి పట్టించుకోకపోవడంతో మట్టి అవసరమున్న వారంతా కట్టకు సమీపంలో మట్టిని తీసి తరలించుకుపోతున్నారు. రిజర్వాయర్ తూము వద్ద కట్ట అధికారుల లెక్కల ప్రకారం సుమారు 12 మీటర్లు ఉండగా అక్కడి నుంచి కనీసం 200 మీటర్ల దూరంలో మట్టి, ఒండ్రుమట్టిని తీయాల్సి ఉంటుంది. కానీ సుమారు 100 మీటర్ల దూరం నుంచే ఒండ్రుమట్టిని తరలిస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాలకు, కొందరు ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టిని అనుమతులు లేకుండా తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎక్కడి నుంచి మట్టి తీయాలో కనీసం చెప్పేవారు కూడ లేరని పేర్కొంటున్నారు. ఇలా మట్టి తరలింపుతో రిజర్వాయర్ కట్టకు ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవలని కోరుతున్నారు.


