ముఖ్యమంత్రి చొరవతో..
● 17 ఏళ్ల నిరీక్షణకు తెర
● నేడు దేవరకద్రలో ప్రారంభం
● 5 మండలాల కేసులు ఇక ఇక్కడే
దేవరకద్ర: నియోజకవర్గంగా ఏర్పడిన 17 ఏళ్ల తరువాత కోర్టు కల నెరవేరబోతుంది. గురువారం అధికారికంగా కోర్టును ప్రారంభిస్తున్నారు. కోర్టు పరిధిలోకి దేవరకద్రతో పాటు చిన్నచింతకుంట, అడ్డాకుల, మూసాపేట, కౌకుంట్ల మండలాలకు సంబంధించిన కేసులన్ని బదలాయిస్తారు. ఇక నుంచి కోర్టులోనే కేసుల విచారణ సాగునుంది.
వర్చువల్గా ప్రారంభం..
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మాధవిదేవి వర్చువల్గా దేవరకద్ర జూనియర్ సివిల్ జడ్జి కమ్– జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కో ర్టును గురువారం ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశారు. పాత మండల పరిషత్ భవనాన్ని కొత్త హంగులతో తీర్చిదిద్ది కోర్టుకు సంబంధించి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
కోర్టు రాకతో ఒకే పరిధిలో..
దేవరకద్రకు కోర్టు రాకతో 5 మండలాలు ఒకే పరిధిలోకి రానున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంగా ఏర్పడినప్పటికీ ఎన్నికల సమయంలో తప్పా ఎప్పుడు కూడా అన్ని మండలాలు అనుసంధానంగా పని చేయలేదు. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత నియోజకవర్గం రెండు ముక్కలైంది. కొత్తకోట, మదనాపురం వనపర్తి జిల్లాకు, దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించారు. దీంతో దేవరకద్ర ఎన్నికల సమయంలోనే నియోజకవర్గంగా పని చేయడం తప్పా మిగతా సమయంలో మండలంగా మిగిలింది.
ఎన్నికల సమయంలోనే నియోజకవర్గం..
దేవరకద్ర నియోజకవర్గంగా ఏర్పడిన తరువాత నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. కేవలం ఎన్నికల సమయంలోనే నియోజకవర్గంగా గుర్తింపు లభిస్తుంది. ఆ తరువాత మండలస్థాయిలోనే కార్య కలాపాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని మండలాల కేసులు పలు కోర్టులకు పరిమితంగా ఉండేది. దేవరకద్ర, చిన్నచింతకుంట, కౌకుంట్ల గతంలో ఆత్మకూరు కోర్టు పరిధిలో ఉండేవి. ప్రస్తుతం మహబూబ్నగర్ పరిధిలో ఉన్నాయి. అడ్డాకుల, మూసాపేటకు మహబూబ్నగర్ కోర్టు పరిధి, భూత్పూర్ మండలం జడ్చర్ల కోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం దేవరకద్ర కోర్టు రాకతో భూత్పూర్ తప్పా మిగతా 5 మండలాలు ఒకే గొడుగు కిందకు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చొరవతో దేవరకద్రకు కోర్టు మంజూరైంది. న్యాయశాఖ కూడా సీఎంతో ఉండడం వల్ల అడిగిన వెంటనే కోర్టు మంజూరు చేయడం, ప్రస్తు తం ప్రారంభోత్సవం చేసుకునే అవకాశం లభించింది. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు. నియోజకవర్గ కేంద్రంగా అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తున్నా.
– మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే


