నవాబుపేట: విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందిన ఘటన మండలంలోని గోవానిపల్లిలో చోటు చేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన రైతు గోవు రాజుకు చెందిన గేదెలు మేత మేస్తూ అక్కడే ఉన్న కంచలేని ట్రాన్స్ఫార్మర్ చెంతకు రాగానే షాక్ తగిలి రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో పాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతుకు గేదేలు మృతి చెందటంతో జీవనోపాధి కరువైంది. దీంతో పాటు రెండు గేదెలు దాదాపుగా రూ.2 లక్షలు విలువ చేస్తాయని, ఆర్థికంగా నష్టపోయిన రైతును ఆదుకోవాలని సర్పంచ్ రవికిరణ్ అధికారులను కోరారు.
కంచె లేని ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదం
ఇప్పటూర్ గ్రామంలో గతంలో సైతం రెండు గేదెలు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. దీనికి కంచెలేని ట్రాన్స్ఫార్మర్లే కారణమని సర్పంచ్ ఆరోపించాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే ఇబ్బందులు వస్తున్నాయని, కాబట్టి కంచె లేని ట్రాన్స్ఫార్మర్లకు వెంటనే కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నాగర్కర్నూల్ రూరల్: మండలంలోని పెద్దాపూర్లో విద్యుదాఘాతానికి గురై రెండు పాడి గెదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన చెందిన రైతు సాకలి తిరుపతయ్య తన పాడి గేదెలను మేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాయి. దీంతో రైతు సుమారు రూ.2.3 లక్షలు నష్టపోయినట్లు స్థానికులు తెలిపారు. బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


