● డైట్ కళాశాలకు 13 మంది, బీఎడ్కు 12 మంది కేటాయింపు
● ఆయా కళాశాలల్లో నెల రోజుల పాటు విధులు నిర్వహించనున్న ఎస్ఏలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూటేషన్ల హడావుడి కొనసాగుతుంది. వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల, డైట్ కళాశాలల్లో పనిచేసేందుకు డిప్యూటేషన్ ఇచ్చారు. బీఈడీ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీ పని చేయాల్సి ఉంది. వీరి భర్తీ ప్రక్రియ ఆలస్యం కానుంది. ఈ క్రమంలో వివిధ సబ్జెక్టులు బోధించే 12 మంది స్కూల్ అసిస్టెంట్లను నెల రోజుల పాటు డిప్యూటేషన్పై పంపించారు. అలాగే డైట్ కళాశాలలో పని చేసేందుకు 13 మందికి డిప్యూటేషన్ ఇచ్చారు.
● ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, వసతుల కల్పన తదితర అంశాలను పరిశీలించేందుకు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసేందుకు మొత్తం మూడు టీంను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కో టీంలో తొమ్మిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. వీరితో పాటు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ తనిఖీల కోసం ముగ్గురు సభ్యులతో ఒక టీంను ఏర్పాటు చేశారు. ప్రైమరీ స్కూల్స్ తనిఖీల కోసం ఒక్కో టీంలో ముగ్గురు చొప్పున ఆరు టీంలను ఏర్పాటు చేశారు. వీరు ప్రతి రోజు రెండు పాఠశాలలను తనిఖీలు చేసి విద్యా ప్రమాణాలను పరిశీలించాల్సి ఉంది. వీరిని మంగళవారం పాఠశాలల తనిఖీల ట్రాయల్స్లో భాగంగా పంపించారు. వీరు పనిచేస్తున్న పాఠశాలల్లో పని సర్దుబాటు చేశాక.. వీరిని కూడా డీఈఓ కార్యాలయానికి డిప్యూటేషన్లు ఇచ్చే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు.
డిప్యూటేషన్లు ఇచ్చాం..
ప్రభుత్వ బీఈడీ కళాశాల, డైట్ కళాశాలలో బోధించేందుకు పలువురు ఉపాద్యాయులకు నెల రోజుల పాటు విధులు నిర్వహించేందుకు ఉపాధ్యా యులకు డిప్యూటేషన్లు కల్పించాం. వీరితో పాటు పాఠశాలల్లో తనిఖీలు చేసేందుకు కూడా త్వరలో మరికొంత మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసిన అనంతరం పూర్తిస్థాయిలో డిప్యూటేషన్లు ఇస్తాం.
– విజయకుమారి, డీఈఓ


