మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘నేను చిల్లర మల్లర రాజకీయాల కోసం రాలే.. కేవలం మహబూబ్నగర్ భవిష్యత్ కోసం.. అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు వచ్చా.. ఒక లక్ష్యం కోసం పని చేస్తున్నా..’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గతేడాది ట్రిపుల్ ఐటీని ప్రారంభించగా ఉమ్మడి జిల్లాకు చెందిన 20 శాతం మంది విద్యార్థులే సీటు దక్కించుకోగా.. ఈసారి ఏకంగా 65 శాతం ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. మొత్తం 200 సీట్లు ఉంటే 130 దాకా ఈ ప్రాంతవాసులే పోటీపడి దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘శత శాతం’ ఉత్తీర్ణత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు పదోతరగతి విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించామన్నారు. దీంతో మహబూబ్నగర్లో వంద శాతం ఫలితాలు నమోదు కాగా, జిల్లాలో అది 94 శాతం మేరకు రావడం గర్వ కారణమన్నారు. ఇక త్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడానికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతి విద్యార్థి చదవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సమావేశంలో నగర మేయర్ జి.మమత, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, నాయకులు ఎన్పీ వెంకటేష్, సీజే బెన్హర్, శాంతన్నయాదవ్, వి.మహేందర్, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.


