రాష్ట్ర అభివృద్ధిలో
విద్యుత్ రంగం కీలకం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విపత్తు సమయంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సిబ్బందికి సూచించారు. సోమవారం స్థానిక విద్యుత్భవన్లో శాఖ పనితీరుపై జరిగిన సమీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరా నాణ్యతలో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరా, ఫీడర్ల పనితీరు, పెండింగ్ అభివృద్ధి పనులు, కాలిన స్టక్అప్ మీటర్ల మార్పిడి, వినియోగదారుల సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు. 2026– 27 సంవత్సరానికి ప్రతిపాదిత అభివృద్ధి పనులు, బడ్జెట్ అవసరాలు, విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి అవసరమైన సామగ్రి అందుబాటు అంశాలపై కూడా అధికారులు సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ భవన్లో మొక్క నాటారు. అదే విధంగా జిల్లా స్టోర్స్ తనిఖీ పర్యటనలో భాగంగా జిల్లా స్టోర్స్ను సందర్శించారు. దివిటిపల్లిలోని అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన 33 కేవీ హెచ్టీ సర్వీసు సందర్శించి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పారిశ్రామిక రంగానికి నాణ్యమైన, విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ శివాజీ, చీఫ్ విజిలెన్స్ అధికారి నారాయణ, చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్ఈ (ఆపరేషన్) మహబూబ్నగర్ జి. భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. స్థానిక విద్యుత్ సౌధలో రూ.52.56 లక్షల వ్యయంతో నిర్మించనున్న విజిలెన్స్– ఏపీటీఎస్ పీఎస్ భవన నిర్మాణ పనులకు సీఎండీ జితేష్ విపాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని హన్వాడ మండలం గొండ్యాలలో 133 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూములను గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మేయర్ గుమ్మాల మమత, ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ల్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


