● పద్మశ్రీ అవార్డు గ్రహీత
డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి
స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని, మహబూబ్నగర్ ప్రాంత వాసులు ఇంత ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి అన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ పాలకొండ విజయానందరెడ్డి సన్మానోత్సవం ఆదివారం రాజా బహుదూర్రెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోగుల ప్రేమ, దీవెనలే తన సంపద అని అన్నారు. జిల్లాకు చెందిన క్యాన్సర్ రోగులు నన్ను కలవడానికి వచ్చినప్పుడు సరైన సలహాలు, వైద్యం అందిస్తానని తెలిపారు. అలాగే వారికి ఆర్థికంగా అండగా నిలిచి సహాయంగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పాలకొండ విజయానందరెడ్డికి పద్మశ్రీ అవార్డు లభించడం జిల్లాకే గొప్ప గౌరవమన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం మన యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, రెడ్డిసేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూము ఇంద్రసేనారెడ్డి, వేపూరు రాజేందర్రెడ్డి, నాయకులు మల్లు నర్సింహారెడ్డి, జి.వెంకట్రాంరెడ్డి, నలమద్ది సురేందర్రెడ్డి, కోటేశ్వర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.


