● రిజర్వాయర్ కోసం భూములు ఇవ్వలేం
● భూసేకరణ గ్రామసభలో
తనగల గ్రామ రైతులు
రాజోళి: ‘‘ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో ఇతర ప్రా ంతాల్లో భూములను కొనలేం.. ఆ డబ్బు ఏడాదిలో గా అయిపోతుంది. ఆ తర్వాత మేము కూలీలుగా మారాల్సిందే.. ఇతర గ్రామాలకు నీరందించేందు కు తమకు జీవనోపాధిగా ఉన్న భూములను కోల్పో లేం..’’ అని వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతులు స్పష్టం చేశారు. గురువారం గ్రామ పంచా యతీ కార్యాలయంలో భూసేకరణ స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మల్లమ్మకుంట రిజర్వాయర్కు భూ సేకరణపై గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు లు తమ అభిప్రాయాలను వెల్లడించే క్రమంలో తమకు మల్లమ్మకుంట రిజర్వాయర్ వద్దే వద్దని ముక్తకంఠంతో నినదించారు. జిల్లా మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారని.. ఎన్నో ఎకరాల భూములు పోతున్నాయని.. ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో నీరు ఎక్కడైనా పారుతుందా అని ప్రశ్నించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు వచ్చి రిజర్వాయర్ కోసం భూములు అడిగితే ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం చిన్నోనిపల్లె నుంచి ఆర్డీఎస్కు నీరందించేందుకు అవకాశం ఉండటంతో పాటు నెట్టెంపాడు నుంచి తీసుకొచ్చిన కెనాల్ కూడా వృథాగా తవ్వి ఉంచారని.. ముందుగా ఆ పనులు సాగేలా చూడాలన్నారు. ఇప్పటికే భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్న చిన్నోనిపల్లె నుంచి కలిపితే, మల్లమ్మకుంట కోసం రైతులు భూములు కోల్పోవాల్సిన అవసరముండదని తెలిపారు. ఈ అంశంపై అధికారులు స్పందిస్తూ.. కృష్ణానది నుంచి వచ్చే నీటిని వాడుకునేందుకు కొన్ని రిజర్వాయర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్ వాటా ను వినియోగించుకోవాలంటే తప్ప నిసరిగా మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మించాల్సిందేనని.. తద్వారా ఆయకట్టు సస్యశ్యామలం అవు తుందని చెప్పారు. గతంలోనే మల్లమ్మకుంట నిర్మాణానికి తనగల సమీపంలోని భూమిని గుర్తించామని అధికారులు చెప్పగా.. ఆ విషయాన్ని అప్ప టి నుంచి రైతులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇక్కడ నిర్మించే బదులు జూలకల్లో నిర్మించాలని.. అక్కడైతే ప్రభుత్వ భూమితో పాటు సాగు కు ఆమోదయోగ్యం కాని భూములు కూడా ఉన్నా యని తెలిపారు. కాగా, మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి మొత్తం 567 ఎకరాల భూమి అవసముండగా.. అందులో 124 ఎకరాలు అసైన్డ్ భూమి ఉందని, మిగిలిన భూమి పట్టా భూమిగా ఉందని అధికారులు తెలిపారు. డీపీఆర్ ప్రకారం మల్లమ్మకుంట నిర్మిస్తేనే నీటి విడుదలకు, స్టోరేజీకి సరైన విధంగా ఉంటందని.. రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామసభలో ఆర్డీఎస్ డీఈలు నాగరాజు, రాంపతి, తహసీల్దార్ శివకుమార్, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్రెడ్డి, సీఐ శంకర్, ఎస్ఐ నాగశేఖర్రెడ్డి పాల్గొన్నారు.


