● రూ.22.87 లక్షల నిధులు మంజూరు
● మెయిన్ స్టేడియంలో ఏర్పాటుకు చర్యలు
● 20 మంది బాలుర చేరికకు అవకాశం
మహబూబ్నగర్ క్రీడలు: పాలమూరుకు మరో క్రీడా అకాడమీ మంజూరైంది. నగరంలోని మెయిన్ స్టేడియంలో బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటు కానుంది. ఇప్పటికే మెయిన్ స్టేడియంలో బాల, బాలికల వాలీబాల్ అకాడమీ కొనసాగుతుండగా.. ఇప్పుడు అండర్–16 బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2026– 27 విద్యాసంవత్సరంలో అకాడమీ ప్రారంభించాలని క్రీడాప్రాధికార సంస్థ శాట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే రాష్ట్రంలోనే మొదటి కబడ్డీ అకాడమీ మహబూబ్నగర్లో ఏర్పాటు అవుతుండడం విశేషం.
అదనపు విభాగంగా..
డీఎస్ఏ వాలీబాల్ అకాడమీలో 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని అదనపు విభాగంగా ఏర్పాటు చేయనున్నారు. కబడ్డీ అకాడమీలో 20 మంది బాలురకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు కబడ్డీ అకాడమీ కోసం రూ.22,87,680 నిధులు మంజూరు చేశారు. కబడ్డీ అకాడమీల 2026– 27 ప్రవేశాల కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు. ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా క్రీడాకారులకు క్రీడా దుస్తులతోపాటు షూస్లు, మంచి పౌష్టికాహారం అందించడంతోపాటు వారు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలల్లో చదువుకునేలా అవకాశం కల్పిస్తారు.
మెరుగైన క్రీడా శిక్షణ
కబడ్డీ అకాడమీకి ఎంపికయ్యే క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. అకాడమీలో ప్రత్యేక శిక్షణ కోసం కబడ్డీ మ్యాట్లు ఏర్పాటు చేసి నిష్ణాతులైన కోచ్ల ఆధ్వర్యంలో క్రీడా శిక్షణ అందనుంది. కబడ్డీ అకాడమీ ఏర్పాటుతో క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. ప్రతి ఏడాది క్రీడాకారులకు సబ్ జూనియర్, జూనియర్, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు. మెయిన్ స్టేడియంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటు అవుతుండడంపై సీనియర్ క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు.


