● 1,334 కేసుల్లో కక్షిదారులకునోటీసులు జారీ
● ప్రధాన కోర్టు న్యాయమూర్తి ఎన్.ప్రేమలత
పాలమూరు: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉండి కోర్టు ముందుకు రాని కేసులను పరిష్కరించేందుకు ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. జిల్లా కోర్టులో ని న్యాయమూర్తి చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ నిర్వహణ కోసం మొత్తం 8 బెంచీలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 1,334 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ గుర్తించిన కేసుల్లో 32 కేసులు ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. రాజీ అయ్యే అన్ని రకాల క్రిమినల్, సివిల్ కేసులు, రోడ్డు ప్రమాద, బ్యాంకు కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు సైతం తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా డబ్బు వృథా కాకుండా ఉంటుందని, దీంతో పాటు ఇరువర్గాలకు తక్షణ పరిష్కారం దొరుకుతుందన్నారు. లోక్ అదాలత్లో దాఖలు చేసే క్రమంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పోలీస్ శాఖతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకు అధికారులు ప్రతి ఒక్కరూ వారి పరిధిలో ఉన్న పెండింగ్ కేసులలో ఉన్న కక్షిదారులకు నోటీసులు ఇచ్చి లోక్ అదాలత్కు హాజరయ్యే విధంగా చూడాలన్నారు.


