చిన్నారి మృతిపై రాజకీయాలు చేయొద్దు
● ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ
జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు
కందనూలు: రెండు నెలల పసికందు ప్రాణాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తగదని, దీనిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు అన్నాడు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు కార్యాలయంలో కొత్తపల్లి వెంకటయ్య అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. దళిత నాయకులు వంకేశ్వరం నిరంజన్, జెట్టి ధర్మరాజు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 18న నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలోని జాతరలో జరిగిన ఘటనలో కొందరు ఆధిపత్యం కోసం పసిపాపను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సమంజసం కాదని, గణేష్ కుటుంబాన్ని ఈ ఘటనలో ఇరికించి చిన్న సంఘటనను పెద్దగా చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు, కుల సంఘాల నాయకులు నాగర్ కర్నూల్ వచ్చి అమాయకులైన గణేష్ కుటుంబాన్ని రోడ్డుకు ఈర్చి వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గణేష్ భార్య మౌనిక ఎస్సీ అని ఆమైపె కులం పేరుతో దుర్భాషలాడి కొట్టారని అబద్దం చెబుతున్నారని అసలు మౌనిక కులం ఎస్సీ ఏ కాదన్నారు. తమ స్వార్ధ ప్రయోజనాల కొరకు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని నిజంగా ఇందులో దాడి చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్నారు. కార్యక్రమంలో వివిధ దళిత, కుల సంఘాల నాయకులు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


