ఓటమి విజయానికి తొలిమెట్టు
మక్తల్: ప్రతి క్రీడాకారుడుకి ఓటమి విజయానికి తొలిమెట్టని క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్లో సెకండ్ ఏడిషన్ సీఎం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందినవారికి కప్తోపాటు మెడల్స్, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహమతులను అందజేశారు. ఫైనల్లో పురుషుల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టుపై వనపర్తి జిల్లా 20పాయింట్లు తేడాతో గెలుపొందగా.. మహిళా విభాగంలో రంగారెడ్డి జిల్లాపై జోగుళాంబ గద్వాల జిల్లా జట్టు 5పాయింట్లతో తేడాతో గెలుపొందింది. ఇరుజట్ల మధ్య ఆడుతున్న తీరును మంత్రి శ్రీహరి వీక్షించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మక్తల్లో కనీవిని ఎరుగని రీతిలో క్రీడలు జరిగాయన్నారు. 33జిల్లాల నుంచి సుమారు 12వందల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. మక్తల్కు కబడ్డీకి అవినాభావ సంబంధం ఉందన్నారు. క్రీడలపై ఆశ, శ్వాస, ద్యాస ఉంటేనే ఉత్తమ క్రీడాకారులుగా రాణిస్తారన్నారు. మక్తల్లో రూ.25కోట్లతో స్టేడియం త్వరలో నిర్మించబోతున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి మక్తల్కు మంచిపేరు తీసుకురావాలని కోరారు. అనంతరం మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.75వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50వేలు అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే 4రోజులుగా క్రీడాకారులకు వసతి కల్పించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు క్రీడకారులు, పీఈటీలు, కోచ్లను సన్మానించారు. కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, వైస్ చైర్పర్సన్ శైవిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, డీఈఓ గోవిందరాజులు, మాజీ ఎంపీపీ కొండయ్య, డీవైఎస్ఓ వెంకటేశ్శెట్టి, కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, పీడీలు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ప్రశాంతంగా ముగిసిన సీఎం క్రీడలు
మక్తల్లో ఈనెల 20వ తేదీ నుంచి నాలుగు రోజులుగా రాష్ట్రస్థాయి రెండో ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ పోటీలు ప్రశాతంగా నిర్వహించారు. దాదాపు 33జిల్లాల నుంచి 66జట్లకుగానూ 12వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలను విజయవంతం చేసినందుకు డీవైఎస్వో వెంకటేశ్శెట్టి, పీడీ విష్ణు, పీఈటీ రాఘవేందర్ను మంత్రి అభినందించారు. అదేవిధంగా సోమవారం పైనల్కు చేరిన కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. పురుషులు, మహిళలు పోటీలు హోరాహోరీగా సాగాయి. మహిళా విభాగంలో గద్వాల–రంగారెడ్డి మ్యాచ్లో 36–31 పాయింట్లు తేడాతో రంగారెడ్డిపై 5పాయింట్లతో గద్వాల జట్టు విజయం సాధించింది. మూడో స్థానం కరీంనగర్–హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 37–18 పాయిట్లతో కరీంనగర్ మూడోస్థానం గెలుపొందింది. పురుషుల విభాగంలో వనపర్తి జట్లు రంగారెడ్డి జట్టుపై 39–16పాయింట్ల తేడాతో వనపర్తి జట్టు విజయం సాధించింది. మూడోస్థానం కోసం గద్వాల–మేడ్చల్ జట్లు తలపడగా 39–32 పాయింట్ల తేడాతో గద్వాల జట్టు విజయం సాధిందించి.
క్యాంప్ఫైర్లో పాల్గొన్న మంత్రి శ్రీహరి
మక్తల్లో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆదివారం రాత్రి మినీస్టేడియంలో క్యాంపుపైర్ను మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి వాకిటి లలిత, మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస ప్రారంభించారు. అనంతరం నృత్యాలు, డ్యాన్సులు, కోలాటం అడుతూ చూపరులకు కనువిందు చేశారు. మహిళలు దాండియా నృత్యాలు చేశారు.


