మెరుగైన వైద్య సేవలు అందాలి
పాలమూరు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. కోయిలకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్సీ తనిఖీలో భాగంగా రోగులు, గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, రోజువారీ ఓపీ వివరాలు సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు. రిజిస్టర్లు పక్కాగా అమలు చేయాలని సూచించారు. మందుల కొరత ఉన్నట్లు స్థానిక నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు ప్రసవం తర్వాత శిశువులకు టీకాలు వేయించేందుకు ఉపకేంద్రాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని చెప్పడంతో కలెక్టర్ వెంటనే డీఎంహెచ్తో మాట్లాడి శిశువులకు టీకాలు సీహెచ్సీలోనే ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి పలు అంశాలపై ఆరా తీశారు. తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి, పెండింగ్ ఫైళ్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజాగణేష్ పాల్గొన్నారు.
ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు
మహబూబ్నగర్ న్యూటౌన్: ప్రణాళికబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ విజయేందిర అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అంబేడ్కర్ కళాభవన్లో నిర్వహించిన వార్షిక పరీక్షలపై ప్రేరణ, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వార్షిక పరీక్షలకు భయపడాల్సిన అవసరం లేదని, ఆత్మవిశ్వాసంతో చదివితే పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చని సూచించారు. సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెస్టులు రాయడం, ప్రాక్టీస్ పేపర్లు సాధన చేయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చని పేర్కొన్నారు. మాతృభాషపై పట్టు ఉన్నవారు ఇతర భాషలను కూడా సులభంగా నేర్చుకోవచ్చని, తాను కూడా స్పానిష్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నానని ఉదాహరణగా చెప్పారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సునీత, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సుదర్శన్, అధికారులు పాల్గొన్నారు.


