Telangana Crime News: సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగిన భర్త!
Sakshi News home page

నా చావుకు కారణం నా భార్యే.. సెల్ఫీ వీడియో తీసిన భర్త!

Published Wed, Jan 10 2024 12:44 AM

- - Sakshi

గోపాల్‌పేట: సెల్ఫీవీడియో తీసి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో మంగళవారం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. రేవల్లి మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, బాలకిష్టమ్మల కుమారుడు శివకు లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శారదతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు.

మంగళవారం శివ మూడు నిమిషాల సెల్ఫీ వీడియో తీశాడు. అందులో తాను మరణిస్తున్నానని తన చావుకు కేవలం తన భార్యే కారణమని, తాను మరణిస్తే భార్యపైనే చర్యలు తీసుకోవాలని వీడియోలో చెప్పాడు. గొడవలు జరిగి పెద్దలను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదని, రేవల్లి పోలీసులు సైతం తనని పట్టించుకోలేదని సెల్ఫీ వీడియోలో చెప్పాడు.

వీడియో రేవల్లి గ్రామ వాట్సాప్‌ గ్రూపులో ప్రత్యక్షమయ్యేసరికి కొందరు యువకులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో శివ కుటుంబ సభ్యులు, పోలీసులు వారి ఇంటికెళ్లి చూడగా అప్పటికే పురుగుల మందు తాగి ఉన్నాడు. వెంటనే అతన్ని రేవల్లి సీహెచ్‌సీకి తరలించారు. తరచుగా తన కుమారుడిని కోడలు వేధించేదని, వారు వనపర్తి, నాగర్‌కర్నూల్‌, పెద్దకొత్తపల్లిలో జీవనం గడిపారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ తర్వాత శివను వదిలేసి హైదరాబాద్‌ వెళ్లిందని, ఆ తర్వాత ఆమె రాకపోవడంతో శివ ఆవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై రేవల్లి ఎస్‌ఐ శివకుమార్‌ను వివరణ కోరగా, తన దృష్టికి రాలేదని, రెండు రోజుల్లో అతని ఆరోగ్యం కుదుట పడ్డాక బాధితులతో వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం శివ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

Advertisement
Advertisement