మొత్తం 87 గ్రామాల్లో..
పారితోషికం సరిపోదని..
జిల్లాలో భూభారతి రీ సర్వేకు రివర్స్ పంచ్లు
● పాల్గొనని లైసెన్స్డ్ సర్వేయర్లు..
డిప్యూటేషన్లలో ప్రభుత్వ సర్వేయర్లు
● క్షేత్రస్థాయిలో అడ్డంకులు
సృష్టిస్తున్న ఎఫ్లైన్ ఫిర్యాదులు
● ఇప్పటికీ ప్రామాణికంగా
నిజాం కాలం నాటి మ్యాపులే
● జిల్లాలోని 6 గ్రామాల్లో
సా..గుతున్న సర్వే పనులు
–8లో u
●
జిల్లాలో భూ రీ సర్వేకు సర్వేయర్ల కొరత వేధిస్తుంది. లైసెన్స్డ్ సర్వేయర్లు వారికిస్తున్న పారితోషికం సరిపోవడం లేదని రావడం లేదు. ఒకవైపు ప్రాజెక్టుల భూసేకరణ పనులు, ఎఫ్లైన్ ఫిర్యాదుల పరిష్కారం వంటి వాటితోపాటు భూ రీ సర్వే పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 18 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాం.
– ఎండీ మూసా,
డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే
మహబూబ్నగర్ న్యూటౌన్: గుట్టకు ధారం కట్టాం.. వస్తే గుట్ట.. లేకుంటే ధారం అన్నట్లుగా ఉంది జిల్లాలో భూముల రీ సర్వే తీరు. భూముల రీసర్వే ద్వారానే భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చనే ప్రభుత్వ ఆలోచన బాగున్నప్పటికీ ఆరు నెలలుగా ఆచరణలో కప్పదాట్లు వేస్తోంది. ఎదురవుతున్న అనేక సమస్యల కారణంగా రీ సర్వేకు రివర్స్ పంచ్ తగులుతోంది. లైసెన్స్డ్ సర్వేయర్లు రాకపోవడం, ఉన్న సర్వేయర్లలో డిప్యూటేషన్లపై వెళ్లడం, సిబ్బంది ఖాళీలు, ఎఫ్–లైన్ ఫిర్యాదుల పెండింగ్, భూ సేకరణ పనులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం వంటివి రీ సర్వేకు సవాళ్లు విసురుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. నిజాం కాలంలో జరిగిన సర్వేల ఆధారంగా తయారు చేసిన మ్యాపులు, హద్దులే ఇప్పటికీ ప్రామాణికంగా ఉండటం, భూముల విలువలు రోజురోజుకూ పెరుగుతుండటంతో హద్దుల గొడవలు, గెట్టు పంచాయితీలు, సర్వే నంబర్ల ఓవర్ ల్యాపింగ్, సబ్డివిజన్ సమస్యలతో భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. భూ ప్రక్షాళనతో రికార్డుల ప్యూరిఫికేషన్ చేపట్టినప్పటికీ సమస్యలు తీరలేదు.
ముందుగా పైలెట్ ప్రాజెక్టు గ్రామంలో..
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద గండేడ్ మండలంలోని సాలార్నగర్ గ్రామంలో భూముల రీసర్వే చేపట్టారు. అక్కడ ఎదురైన అనుభవాలను అంచనా వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 2025 అక్టోబర్ 27న జిల్లాలో 17 గ్రామాలను ఎంపిక చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన సిబ్బంది లేకపోతే సాధ్యం కాదని లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను భూ రీసర్వేకు ఉపయోగించుకోవాలని వారికి శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు జారీ చేసింది. భూ రీ సర్వేకు ఎంపిక చేసిన గ్రామాల్లో మండల సర్వేయర్ పర్యవేక్షణలో సర్వే నిర్వహణకు లైసెన్స్డ్ సర్వేయర్లను కేటాయించారు. ఈ ప్రక్రియ నడుస్తుండగానే జిల్లాలో మరో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వేకు అనుమతించింది. అయితే ఆరు నెలల క్రితమే ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రీసర్వేకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా సిబ్బంది కొరత కారణంగా ముందుకు సాగలేదు. హన్వాడ మండలం చీకర్లపల్లి, కోయిలకొండ మండలం ఖాజీపూర్, మహబూబ్నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ రెవెన్యూ గ్రామాల్లో ముందుగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహణ కల్పించిన అనంతరం రీసర్వే ప్రారంభించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు.
జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 87 గ్రామాల్లో భూ భారతిలో భాగంగా భూ రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రీ సర్వేకు సిబ్బంది కొరత, నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల సవాళ్లు ఒకవైపు ఉండగా.. మరోవైపు ఎఫ్–లైన్ ఫిర్యాదుల పరిష్కారం, ప్రాజెక్టుల భూసేకరణ వంటి అంశాలు సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని 17 మండలాలకు గాను 3 సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉండగా 6 మంది సర్వేయర్లను నారాయణపేటకు డిప్యూటేషన్పై పంపారు. మిగతా వారిలో ఇద్దరికి ప్రమోషన్ రాగా ప్రస్తుతం జిల్లాలో ఆరుగురు పనిచేస్తున్నారు. ఈ ఆరుగురే భూ రీ సర్వేకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాజెక్టుల భూసేకరణ పనులు, ఎఫ్లైన్తోపాటు ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి. భూ రీసర్వే పనుల్లో నిమగ్నం కావడంతో ఎఫ్లైన్ ఫిర్యాదుల పరిష్కారం కాక ఆ సంఖ్య 1,415కు చేరింది.
భూ రీ సర్వేలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం వారికి గ్రామాలను కేటాయించగా సర్వేలో పాల్గొనడం లేదు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తమకు సరిపోవడం లేదని సర్వే నిర్వహణకు హాజరు కాకపోవడంతో భూ రీసర్వే ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన పారితోషికం ఎకరాకు రూ.60 ఏమాత్రం సరిపోదని.. గౌరవంతో కూడిన వేతనం ఇస్తేనే తాము భూ రీసర్వే నిర్వహిస్తామనే డిమాండ్ను ముందుంచగా ఎటూ తేలడం లేదు.


