జిల్లాలో ప్రాణాలు కోల్పోతున్న వారిలో మగవారే అధికం
●
పాలమూరు: పుట్టుకలో మహిళల కంటే ముందు వరుసలో కొనసాగుతున్న పురుషులు.. మరణాల్లో సైతం అదే బాటలో పయనిస్తున్నారు. పురిట్లో కొందరు మరణిస్తుంటే.. అధికంగా చెడు వ్యసనాలు, అనారోగ్య సమస్యలు.. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో మరణాల లెక్కలను పరిశీలిస్తే.. నాలుగు పదుల వయసులోనే చాలామంది తనువు చాలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలే అధిక శాతంగా ఉంటున్నాయి. దాదాపు అదే వయసులో ఉన్నవారు ప్రస్తుతం 37.23 శాతం రక్తపోటు, 28.36 శాతం మధుమేహంతో బాధపడుతున్నారు. గతేడాది కాలంలో జిల్లాలో 2,863 మంది మరణించగా.. ఇందులో 1,923 మంది పురుషులే ఉండటం గమనార్హం. వీటిలోనూ గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే అధికంగా నమోదయ్యారు.
జీవనశైలితోనే పెద్ద దెబ్బ
గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్నివర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి.. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు (టార్గెట్లు) అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. ఈ క్రమంలో చాలామంది వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. తీవ్ర అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటున్నారు. ఫలితంగా చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎక్కువ మంది గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్నారు. ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇళ్లలో వండుకునే తీరిక.. ఓపిక లేక బయట తిళ్లకు అలవాటు పడుతున్నారు.
ప్రసవాల్లో మొదలుకొని.. వివిధ రకాల కారణాలతో మృత్యువాత
పల్లెల్లో కంటే పట్టణాల్లోనే
మరణాల శాతం ఎక్కువ
యుక్త వయసులో మద్యం, సిగరెట్ ఇతర చెడు అలవాట్లే కారణం
ఆహారపు అలవాట్లతోపాటు జీవన విధానంతోనూ మరణశాసనం


