స్టేషన్ మహబూబ్నగర్: నగరంలోని కుర్హినిశెట్టికాలనీ మైసమ్మ ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ జరిపి.. ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి దేవాలయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని నగర మేయర్ మమత, కార్పొరేటర్లు దర్శించుకున్నారు.
వేగంగా విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు.
రామచంద్రాపూర్లో మద్య నిషేధం
మహబూబ్నగర్ రూరల్: యువత మద్యానికి బానిసవడంతోపాటు కుటుంబాలకు భారంగా మారుతున్న పరిస్థితిని అరికట్టాలనే ఉద్దేశంతో రూరల్ మండలంలోని రామచంద్రాపూర్లో మద్య నిషేధం విధిస్తూ తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింహులు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామస్తులు పాల్గొని బెల్ట్ షాపులపై కఠిన చర్యలకు మద్దతు తెలిపారు. ఇకపై గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని, అలాంటి వారి సమాచారాన్ని అందించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వాలని తీర్మానించడం గమనార్హం.


