బయ్యారం: బయ్యారం పెద్ద చెరువుకు గోదావరి జలాలు వచ్చేంత వరకూ సీపీఐ పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ్సారథి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016లో బయ్యారం పెద్దచెరువుకు గోదావరి జలాలు అందిస్తామని అప్పటి ప్రభుత్వం రోళ్లపాడులో శంకుస్థాపన చేసినప్పటికీ.. ఆ నీరు దొడ్డిదారిన ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారన్నారు. పెద్దచెరువుకు గోదావరి జలాలు అందించాలని తమ వినతికి స్పందించి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించారన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక సంవత్సరాలుగా బయ్యారం పెద్దచెరువు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. బయ్యారం పెద్దచెరువుకు గోదావరి జలాలు తీసుకొస్తే బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల రైతులకు సాగు నీరు, మహబూబాబాద్ పట్టణానికి తాగునీరు అందుతుందన్నారు. సమావేశంలో నాయకులు కె.శ్రీనివాసరావు, ఎస్, శ్రీనివాస్, పద్మ, హరినాయక్, రాజు, కళింగరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
మహబూబాబాద్ రూరల్: నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలపై యువతలో అవగాహన కల్పిస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్చార్జ్ జాతీయ కార్యదర్శి ఖలీద్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఖలీద్ అహ్మద్ హాజరై మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలను వివరించి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే యువజన కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రతీ సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలులో విఫలమైందని విమర్శించారు. దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను యువజన కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగాలు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలో యువతను సంఘటితం చేసి, యువజన కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని అన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జ్ అల్వాల కార్తీక్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్య వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు జర్పుల విజయ్ నాయక్, మానుకోట, డోర్నకల్ అసెంబ్లీల అధ్యక్షులు గార్లపాటి సాయితేజ, చాగంటి సందీప్, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీకి
మృతదేహం అప్పగింత
నెహ్రూసెంటర్: మానుకోట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థుల పరీక్షల కోసం మృతదేహం అందజేశారు. జిల్లా కేంద్రానికి చెందిన దర్శనం వెంకటమ్మ(76) శనివారం మృతిచెందగా.. ఆమె కుమారులు న్యాయవాది దర్శనం రామకృష్ణ, ఏఆర్ కానిస్టేబుల్ నాగార్జున, లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ప్రోత్సాహంతో తమ తల్లి వెంకటమ్మ మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, అటానమీ హెచ్ఓడీ భరత్ కుమార్కు మృతదేహాన్ని అప్పగించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ కార్యదర్శి పరకాల రవీందర్రెడ్డి, సెక్రటరీ పారుపల్లి రమేష్బాబు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు, మా అసోసియేషన్ అధ్యక్షుడు లయన్ బొడ్డుపల్లి ఉపేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


