కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ) బీఏ, బీకాం (జనరల్ అండ్ కంప్యూటర్స్), బీబీఏ, బీఎస్సీ ఇయర్ వైజ్ స్కీం ప్రథమ సంవత్సరం ఎక్స్ అభ్యర్థులకు ఈనెల 21 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. అదేవిధంగా ఎంఏ, ఎంకాం, హెచ్ఆర్ఎం, ఎంఎస్సీ సెకండియర్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రెగ్యులర్ 2023–2024 బ్యాచ్ విద్యార్థులకు ఈనెల 21 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్ల వారు పేర్కొన్నారు. కేయూ పరిధిలోని దూరవిద్య బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ సెకండియర్ మొదటి సెమిస్టర్ పరీక్షలు (2023–2024 బ్యాచ్) ఈనెల 26 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు కాకతీయ యూనివర్సిటీ ఎస్డీఎల్సీఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసినా
ఆగని బెదిరింపులు
శాయంపేట: మండల కేంద్రానికి చెందిన కందగట్ల గోపాల్ తాను మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేసినా సైబర్ నేరగాళ్ల వేధింపులు ఆగట్లేదు. బాధితుడు గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్బుక్ మ్యాట్రిమోనియల్లో తాను ఓ పోస్ట్ పెట్టిన వెంటనే పోలీసులమంటూ హనుమకొండ ఎస్పీ భానుచందర్, చిత్తుర్ ఎస్పీ అమరనాథ్, సీఐ అమర్నాథ్ పేర్లతో ఫోన్లు వచ్చాయి. వారం రోజుల నుంచి బెదిరింపులకు గురి చేస్తూ కొద్దికొద్దిగా మొత్తం రూ.1.5 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఇంతటితో ఆగకుండా రూ. 8 వేలు కావాలని అవి ఇస్తే.. ఇప్పటి వరకు తీసుకున్న మొత్తం నగదు ఇస్తామని, లేదంటే కేసు పెట్టి లోపల పడేస్తామని సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురి చేశారు. పోలీస్ శాఖ తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు.
రైలుకింద పడి
మహిళ ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్: కాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందేభారత్ రైలుకింద పడి గుర్తుతెలియని మహిళ (30) ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘన్పూర్–నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం జరిగింది. కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఘన్పూర్–నష్కల్ రైల్వేస్టేషన్ల మధ్య 306/23–27 కిలోమీటరు నంబర్ వద్ద అప్లైన్లో వందేభారత్ రైలుకిందపడి మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. మహిళకు సంబంధించిన వివరాలు తెలియరాలేదని, మృతురాలి శరీరంపై నీలం రంగు పంజాబ్ డ్రెస్, తెలుపురంగు చున్నీ ఉన్నాయన్నారు. మృతదేహం ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉందని, మృతురాలి ఆచూకీ తెలిస్తే 87125 76424, 99483 48070 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
లారీ ఢీకొని జగ్జీవన్రామ్ విగ్రహం ధ్వంసం
తొర్రూరు రూరల్ : అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బాబు జగ్జీవన్రామ్ విగ్రహం ధ్వంసమైనా సంఘటన మండలంలోని వెలికట్ట శివారు పాలకేంద్రం వద్ద ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అతివేగం వచ్చి బాబు జగ్జీవన్రామ్ గద్దెను ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. నిర్వాహకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సంబంధిత లారీని అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


