మహబూబాబాద్ రూరల్ : అనారోగ్యంతో కుమారుడు మృతి చెందగా.. ఆస్తి పంచి ఇవ్వాలని కోరుతూ కోడలు.. ఆమె బంధువులు మామ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన మానుకోట మున్సిపాలిటీ పరిధి బేతోలు గ్రామశివారు మాన్సింగ్ తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాన్ సింగ్ తండాకు చెందిన బోడ హుస్సేన్, జమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బిక్కు గత ఏడాది జూలై 27న అనారోగ్యంతో మృతిచెందగా ఆ సమయంలో అతనికి రావాల్సిన ఆస్తిని ఇవ్వాలని కోడలు తరపు బంధువులు హుస్సేన్ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగారు. ఈక్రమంలో శుక్రవారం బిక్కు సంవత్సరీకం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆస్తి విషయంలో హుస్సేన్, బిక్కు భార్య ఝాన్సీ తరఫు బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ తలెత్తింది. ఝాన్సీ, బంధువులు హుస్సేన్ ఇంటిపై దాడి చేసి ఇంటి ప్రధాన ద్వారం తలుపులు, కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంటిపై ఉన్న నీళ్ల ట్యాంకు పగలగొట్టారు. ఇంటి బయట ఉన్న పైపులు, కట్టెలను దగ్ధం చేసి, హుస్సేన్, భార్య జమ్మ, ఆమె కుమార్తెలు సునీత, జ్యోతి, రవీందర్ పై దాడిచేశారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న కురవి ఎస్సై సతీష్ అగ్నిమాపక వాహనాన్ని రప్పించి దగ్ధమవుతున్న పైపులు, కట్టెలను చల్లార్పించారు. ఇరువర్గాలు కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కేసు నమోదు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై పేర్కొన్నారు.
● వృద్ధుడిపై కోడలు ఆమె తల్లిగారి బంధువుల దాడి
● గతంలోనే కుమారుడి మృతి


