‘మహబూబాబాద్ పట్టణంలోని గోపాలగిరి ప్రాథమిక పాఠశాలలో 38 మంది పిల్లలు ఉన్నారు. గతంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు వెళ్లిపోయారు. ఇప్పుడు ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే ఉన్నారు. ఆమె లీవ్లో ఉంటే బడి మూసివేసే పరిస్థితి ఉంది. అయితే గతంలో ఒక ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్ పంపగా.. కొద్దిరోజులు పనిచేసి వెళ్లిపోయారు. మళ్లీ మొదటికి రావడంతో సదరు ఉపాధ్యాయురాలు జిల్లా ఉన్నతాధిరులను కలిసి సమస్యను చెప్పారు. దీంతో ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఎంఈఓ నోటి మాటతో వచ్చారు. అయితే ఆయన ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయుల సర్దుబాటు చేసి కొత్త ఉపాధ్యాయుడు వచ్చేవరకు ఆ పాఠశాలలో బోధన సరిగా సాగే పరిస్థితి లేదు.’
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ దిద్దుబాటు దశలోనే ఉంది. జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న మిగులు ఉపాధ్యాయులు.. కొరత ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు మొండికేస్తున్నట్లు ప్రచారం. దీంతో పలు పాఠశాలల్లో ఉన్నవారిపైనే భారం పడుతోంది.
కదిలేది లేదని..
జిల్లా వ్యాప్తంగా 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ మొదలుకొని భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు, వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కలిసి 3,124 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన జీఓ ప్రకారం 9 మంది పిల్లలు ఉంటే ఒకరు, 10 నుంచి 19 వరకు పిల్లలు ఉంటే ఇద్దరు, 20 నుంచి 60 మంది పిల్లలు ఉంటే ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులు ఉండాలి. అదే విధంగా జీఓ నంబర్ 25 ప్రకారం ప్రతీ 40 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే మండల యూనిట్గా మొత్తం ఉపాధ్యాయులు, పిల్లల సంఖ్య ప్రకారం జిల్లాలో 240కి పైగా సెకండరీ గ్రేడ్ టీచర్లు, వందకు పైగా స్కూల్ అసిస్టెంట్లు, 50కి పైగా పండితులు, ఇతర పోస్టుల్లో మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అదే విధంగా 92 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నట్లు తెలిసింది. అయితే మిగులు ఉపాధ్యాయులు ఎక్కువ, అవసరం తక్కువగా ఉండడంతో మేమే ఎందుకు వెళ్లాలంటే.. మేమే ఎందుకు వెళ్లాలని సర్ప్లస్ ఉపాధ్యాయుల్లో కొందరు మొండికేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు జోక్యం చేసుకుని తమ సంఘానికి చెందిన వారిని కదిలించవద్దు అంటే.. తమ సంఘం సభ్యుడిని కదిలించవద్దని, కదిలించినా మంచి స్థానాలకు డిప్యుటేషన్ ఇవ్వాలని ఎంఈఓలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దీంతో కొందరు ఎంఈఓలు మండలంలోని పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలపడం, మరికొందరు సెలవు పెట్టి వెళ్లిన సంఘటనలు ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉపాధ్యాయుల సర్దుబాటులో సమస్యలు
కదలబోమని మొండికేస్తున్న సర్ప్లస్ టీచర్లు
కొరతతో కుంటుపడుతున్న బోధన
పాఠశాలలు పునఃప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా పూర్తికాని సర్దుబాటు
సర్దుబాటుకు కసరత్తు
జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సర్ప్లస్, కొరత వివరాలు తెలుసుకొని సర్దుబాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రొఫార్మను అన్ని మండల విద్యాశాఖ అధికారులకు పంపించారు. మండలం, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, వారి హోదా, విద్యార్థుల నమోదు వివరాలు, కొత్త నిబంధనల ప్రకారం ఎంత మంది ఉపాధ్యాయులు పనిచేయాలి, ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారు. ఎంత మంది మిగులు, కొరత వివరాలు పొందు పర్చాలని పేర్కొన్నారు. ఈ నమూనా ప్రకారం అన్ని మండలాల నుంచి వివరాలు రావాల్సి ఉంది.


