ప్లీజ్.. తప్పుకోండి
ప్రతీచోట రెబల్స్..
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. అయితే ఒకే పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులతోపాటు ఎమ్మెల్యేలకు, ఎన్నికల ఇన్చార్జీలకు తలనొప్పిగా మారింది. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల అనుభవాలతో రెబల్స్ లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ఆదేశించిన నేపథ్యంలో రెబల్స్ను బుజ్జగించే పనిలో నాయకులు ఉన్నారు.
బుజ్జగింపుల్లో నాయకులు..
మున్సిపాలిటీలు కై వసం చేసుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టిన నేపథ్యంలో రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. రెబల్స్ పోటీలో ఉంటే నష్టం జరుగుతుందనే ఆలోచనతో వారిని పోటీ నుంచి తప్పించేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం జిల్లాలో పర్యటించారు. మరిపెడ, మహబూబాబాద్లో డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉవమ, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రాంచంద్రునాయక్తో కలిసి సమావేశాలు నిర్వహించారు. రెబల్స్ నామినేషన్లు ఉపసంహరణ చేయించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇరువురు ఎమ్మెల్యేలు రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించడం, మరో అవకాశం ఇస్తామని చెప్పడం, అనుకూల వ్యక్తులతో చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తొర్రూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవ తీసుకొని రెండు వర్గాలను ఏకం చేసి రెబల్స్ను ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే ఈ ప్రయత్నం కొంతమేరకు సఫలం ఐనా.. మరికొందరు మాత్రం ససేమిరా అంటూ.. సమీక్ష సమావేశం నుంచి బయలకు వెళ్లిపోయినట్లు తెలిసింది. అదే విధంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ ప్రత్యేక చొరవ తీసుకొని రెబల్స్ను తప్పించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈనెల 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో సోమవారం ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నంలోఉన్నారు. ఇందుకోసం కొందరికి పదవులు, మరికొందరికి డబ్బులు, ఇంకొందరికి కాంట్రాక్టులు, ఇలా ఎవరు ఎలా వింటే అలా వినిపించే ప్రతయ్నంలో ఇరు పార్టీల నాయకులు ఉన్నారు.
ఐదు మున్సిపాలిటీల్లో రెబల్స్ బెడద
పోటీ నుంచి తప్పుకోవాలని
పలువురిపై ఒత్తిడి
ససేమిరా అంటున్న కొందరు అభ్యర్థులు
బీ–ఫాం తీసుకున్న వారిపైనే భారం
జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రెబల్స్ బెడద పట్టుకుంది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 98వార్డులు ఉన్నాయి. ఇందుకుగానూ మొత్తం 906నామినేషన్లు వచ్చాయి. ఇందులో ఒక్కొక్కరు రెండు సెట్లు వేయడం, రెండు, మూడు వార్డులకు పోటీ చేసిన వారు కూడా ఉన్నారు. వీరుపోగా.. కాంగ్రెస్ పార్టీ పేరుచెబుతూ 267 మంది, బీఆర్ఎస్ పేరు చెప్పి 186 మంది నామినేషన్లు వేశారు. అంటే కాంగ్రెస్ నుంచి 169 నామినేషన్లు, బీఆర్ఎస్ నుంచి 88 నామినేషన్లు రెబల్ అభ్యర్థులు వేసినట్లు అంచనా వేస్తున్నారు.
ప్లీజ్.. తప్పుకోండి


