
మారనున్న రూపురేఖలు
మహబూబాబాద్: జిల్లాలోని మానుకోట, కేసముద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.150కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో అభివృద్ధి పనులకు అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేశారు. త్వరలోనే జాబితాను కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు పంపనున్నారు. పనులు పూర్తయితే రెండు మున్సిపాలిటీల రూపురేఖలు మారనున్నాయి. ఈమేరకు రెండు మున్సిపాలిటీల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
మానుకోట మున్సిపాలిటీకి
రూ.50 కోట్లు..
మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 68,889 మంది జనాభా ఉంది. 25,000పైగా గృహాలు ఉన్నాయి. కాగా ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఈనెల 13న సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా మానుకోట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, కేసముద్రం మున్సిపాలిటీకి రూ .100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కేసముద్రం మున్సిపాలిటీకి
రూ.100 కోట్లు..
ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. ఐదు గ్రామాలను విలీనం చేశారు. 17,597మంది జనాభా ఉంది. 16 వార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ లాంటి కార్యక్రమాలు చేపట్టారు. వార్డుల విషయంలో ఇంకా ఫైనల్ కాలేదని అధికారులు తెలిపారు. ఇన్చార్జ్ కమిషనర్, ఇన్చార్జ్ ఏఈ, ఈఈ, టీపీఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా రూ.50 కోట్లు మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు, మిగిలిన రూ.50 కోట్లు ఆర్అండ్బీ, వివిధ శాఖల నిధులు ఉన్నాయని సిబ్బంది పేర్కొన్నారు. ఇందులో రూ.50కోట్ల నిధుల ప్రతిపాదనలు పూర్తి చేశారు.
త్వరలోనే ప్రతిపాదనలు
కమిషనర్ కార్యాలయానికి..
రెండు మున్సిపాలిటీల ప్రతిపాదనలను త్వరలోనే ఆశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రతిపాదనలను ఫైనాన్స్ విభాగానికి పంపిన తర్వాత ఆనిధుల జీఓ మున్సి పాలిటీలకు వస్తుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మిగిలిన ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రతి పాదనల్లో కొన్ని మార్పులుచేర్పులు జరుగుతాయి.
ఔటర్ రింగు రోడ్డు కోసం..
మానుకోట చుట్టూ ఔటర్ రింగు రోడ్డు కోసం ఎమ్మెల్యే మురళీనాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రిని కలువగా.. సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అనుమతి ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగితే ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఎమ్మెల్యే మార్క్ ఉంటుందని ప్రజలు అంటున్నారు. పనులన్నీ పూర్తయితే మానుకోట రూపురేఖలు మారుతాయి.
మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు
అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం
మానుకోట పట్టణం చుట్టూ
ఔటర్ రింగు రోడ్డు కోసం ప్రయత్నాలు
ప్రతిపాదనలు సిద్ధం..
ప్రత్యేక నిదుల నుంచి రూ.50కోట్ల మంజూరు కాగా..మానుకోట మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధికి రూ 2.25 కోట్లు కేటాయించారు.
జంక్షన్ల అభివృద్ధికి రూ.35 లక్షలు
అంతర్గత రోడ్ల కోసం రూ.9.81కోట్లు, వరద కాల్వల కోసం రూ.5 కోట్లు కేటాయించారు.
డబుల్ బెడ్రూం ఇళ్లకు కనీస సౌకర్యాల కల్ప నకు రూ.20లక్షలు, పార్క్ల నిర్మాణం కోసం, స్మృతి వనం అభివృద్ధికి రూ.4కోట్లు.
కల్వర్టుల నిర్మాణం కోసం రూ.82లక్షలు, షాంపింగ్ క్లాంపెక్స్ల నిర్మాణం కోసం కోటి రూపాయలు (ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీసమీపంలో ఉన్న గ్రీన్ ల్యాండ్లో, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమీపంలో, వివేకానంద సెంటర్లో) కేటాయించారు.
ఇండోర్స్టేడియం కోసం రూ.5కోట్లు, మోడల్ వైకుంఠధామాల రోడ్ల కోసం రూ.34 లక్షలు కేటాయించారు.
మున్నేరు వాగు వద్ద బతుకమ్మఘాట్ నిర్మాణం కోసం రూ.2.50 కోట్లు, కంబాలచెరువు ట్యాంక్ బండ్ కోసం రూ.4.20 కోట్లు కేటాయింపు.
ఇన్నర్ రింగ్రోడ్డు కోసం రూ.10 కోట్లు, మెయిన్రోడ్ల నిర్మాణానికి రూ.2.76 కోట్లు
తాగునీటి ఫిల్టర్ బెడ్, తదితర వాటి కోసం కోటి రూపాయలు, ఇతర మెయిన్ రోడ్ల కోసం రూ.76 లక్షలు కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.