
సీసీఐ కొనుగోళ్ల విధానం కొనసాగించాలి
వరంగల్ చౌరస్తా : ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా కొనుగోలు జరుపుతున్న విధానంతోనే పత్తి రైతులకు మేలు చేకూరుతుందని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్లో గురువారం ‘బహిరంగ మార్కెట్లో పత్తికి మార్కెట్ ధర, కనీస మద్దతు కంటే తక్కువ ధరలు పలుకుతున్న వ్యత్యాసాలు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మనీష్ మల్పానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం 2025–26 కాటన్ సీజన్లో తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి స్కీం అమలులో ఎదురయ్యే సమస్యలపై రవీందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు అవసరమైన సదుపాయాలు, రెగ్యులేటెడ్ మార్కెట్లలో పత్తి నాణ్యత, బహిరంగ మార్కెట్లోని ధరలను నిర్ధారించడానికి ఎలాంటి ప్రత్యేక వ్యవస్థలు లేవన్నారు. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు జరుపుతున్న విధానమే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు కంటే తక్కువ ధర పలికితే ఆ వ్యత్యాసపు ధరను నేరుగా రైతులకు చెల్లించడానికి కేంద్రం ప్రభుత్వం ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీంను పైలట్ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ప్రకటించినట్లు రవీందర్రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఫైనాన్స్ డైరెక్టర్ పవన్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ జాయింట్ సెక్రటరీ లలిత్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ చాంబర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి