
అన్నకు తమ్ముడి శఠగోపం
వరంగల్ చౌరస్తా : అన్నకు తమ్ముడు శఠగోపం పెట్టాడు. నమ్మి క్యాష్ కౌంటర్పై కూర్చోబెట్టినందుకు రూ.1.37 కోట్లు స్వాహా చేశాడు. మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై చాంబర్ ప్రతినిధులు, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు (అన్న) చల్లా సాంబలింగం విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు గురువారం వరంగల్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను, తన తమ్ముడు సంపత్ కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో 2016 నుంచి కేశవ ట్రేడర్స్ పేరుతో మిర్చి వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను బయట విషయాలు చూసుకుంటుండగా తన తమ్ముడు సంపత్ క్యాష్ కౌంటర్ పై కూర్చుని ఆర్థిక లావాదేవీలు చూసేవాడన్నారు. ఈ క్రమంలో రూ.1.37 కోట్లు మోసం చేశారని పేర్కొన్నారు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ఇవ్వనని.. పైగా డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను చాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ చక్రపాణి వద్దకు వెళ్లగా అతడు పంచాయితీ నిర్వహించి తనకు రావాల్సిన డబ్బును చెల్లించాలని తన తమ్ముడికి చెప్పారన్నారు. అయితే తన తమ్ముడు చెల్లించకపోవడంతో మూడు నెలల క్రితం ఏనుమాముల పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా చాంబర్ ప్రతినిధులు, పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
వ్యాపారంలో రూ.1. 37 కోట్లు ముంచిన తమ్ముడు
న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు