మంత్రాలయం రూరల్: 355వ ఆరాధనోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మిగనూర్ ఇన్చార్జ్ డీఎస్పీ వెంకట రామయ్య తెలిపారు. మండల కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీమఠం మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు పాలొన్ని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సావాలను జయప్రదం చేయాలని పోలీసులను కోరారు. డీఎస్పీ మట్లాడుతూ... బందోబస్తుకు 8 మంది సీఐలు, 12 మంది ఎస్ఐలు, 230 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో శ్రీమఠం ఇంజినీర్ సురేష్ కోనాపూర్, సీఐలు దస్తగిరిబాబు, రామాంజులు, ఎస్ఐలు మల్లికార్జున, విజయ్కుమార్ పోలీసులు ఉన్నారు. ఆరాధనోత్సవంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తామన్నారు. భక్తులు కూడా సహకరించాలన్నారు.
వివాహిత ఆత్మహత్య
డోన్ రూరల్(ప్యాపిలి): గార్లదిన్నె గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలం మంచాల కట్ట గ్రామానికి చెందిన సుప్రియ (22)కు గార్లదిన్నె గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్యతో మూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు, కూతురు (కవలలు) ఉన్నారు. సుప్రియ నల్లగా ఉందని పెళ్లయినప్పటి నుంచి భర్త వెంకటకృష్ణ, అత్త, మామలు లక్ష్మీదేవి, సుధాకర్ వేధింపులకు గురిచేసే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిన వారిలో మార్పు రాలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలకు వేసిన ఉయ్యాల చీరతో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కర్నూలు:కర్నూలు శివారు కోడుమూరు రోడ్డులోని సెయింట్ క్లారెట్ ఇంగ్లిష్ స్కూల్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరుకు చెందిన కుక్కల ఎర్రన్న (40) అక్కడికక్కడే మృతిచెందాడు. స్నేహితుడితో కలసి ద్విచక్ర వాహనంపై కర్నూలు నుంచి సొంతూరుకు వెళ్తున్నారు. అయితే ఎర్రన్న వెనుక కూర్చున్నాడు. ద్విచక్ర వాహనం వెనకనే పైపుల లోడ్తో ట్రాక్టర్ కూడా వెళ్తోంది. అయితే సెయింట్ క్లారెట్ స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ దగ్గర కంట్రోల్ చేసుకోలేకపోవడంతో వెనుక కూర్చున్న వ్యక్తి అదుపు తప్పి వాహనంపై నుంచి కింద పడ్డాడు. వెనుక నుంచి వెళ్తున్న ట్రాక్టర్ తల పైకి ఎక్కడంతో తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గూడూరు మండలం మునగాల గ్రామానికి చెందిన విష్ణువర్దన్ రెడ్డితో పాటు ద్విచక్ర వాహనాన్ని నడిపిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వేధింపులు తాళలేక..
గోనెగండ్ల: భర్త వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి మండలంలోని ఒంటెడుదిన్నె గ్రామంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన కురువ మహేశ్వరి(32)ని గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన కురువ రాముడుకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో 4 ఎకరాలు పొలం కూడా ఉంది. అయితే, గత కొన్నెళ్ల నుంచి మహేశ్వరిని భర్త రాముడు వేధించేవాడు. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసిన రాముడు ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రతి రోజు భార్య మహేశ్వరిని శరీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈ వేధింపులు తాళలేక మహేశ్వరి గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి అన్న ఈరన్న ఫిర్యాదు మేరకు భర్త రాముడు, అత్త ఈరమ్మ, భర్త అన్నలు పెద్ద రంగస్వామి, చిన్న రంగస్వామిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు శుక్రవారం తెలిపారు.


