కర్నూలు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు ఐదో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు నేతృత్వంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు మురళీకృష్ణ, రాజేంద్రప్రసాద్, రాజేష్, ప్రభాకర్, రాము, శ్రీధర్, ముత్యాల శ్రీనివాసులు, రాజశేఖర్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రసూల్ ఖాన్, జాయింట్ సెక్రెటరీ జహంగీర్ బాషా, స్పోర్ట్స్ సెక్రటరీ ప్రభాకర్, కోశాధికారి సుమన రాణి, లైబ్రేరియన్ మహేష్ కుమార్తో పాటు సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, నాగేంద్రనాథ్, జయరాజ్, కపిలేశ్వరయ్య, ఓంకార్, నాగలక్ష్మి దేవి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షపరులకు పూలమాల వేసి సంఘీభావం ప్రకటించారు.
రాజకీయ పార్టీల మద్దతు...
సీపీఐ రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, రైతుసంఘం నాయకులు శేఖర్, కాంగ్రెస్ నాయకులు క్రాంతి నాయుడు, కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు బజారన్న, ఐఎన్టీయూసీ నాయకులు బతుకన్న, ఎంఆర్పీఎస్, ప్రజాసంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి హైకోర్టు శాశ్వత బెంచ్ కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కర్నూలులో శాశ్వత బెంచ్ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.


