కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో అంతంతమాత్రం వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల పాటు ఆకాశం మేఘావృతమవుతున్నా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రెండు మండలాల్లోనే తేలికపాటి వానలు పడ్డాయి. పత్తికొండలో 5.6 మి.మీ, వెల్దుర్తిలో 4.8 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. జూలై నెల సాధారణ వర్షపాతం 90.5 మి.మీ ఉండగా.. ఇప్పటి వరకు 30 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. 66 శాతం లోటు వర్షపాతం ఉండటం గమనార్హం. జిల్లాలో ప్రధాన పంట పత్తి. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటికే 2.10 లక్షల హెక్టార్లలో సాగయింది. వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పటికే పత్తి పూర్తిగా దెబ్బతినింది. నల్లరేగడి నేలల్లో పత్తి సాగు చేస్తారు. తేలికపాటి వర్షాలకు నల్లరేగడి నెలలు ఒక ఇంచు కూడా నానలేదు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పత్తి పంట కోలుకున్న దాఖలాలు లేవు. రానున్న రోజుల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం మాత్రమే ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.


