కర్నూలు(సెంట్రల్): బాలల హక్కులను పరిరక్షించకపోతే దేశ భవిష్యత్ అంధకారమవుతుందని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో బాలల హక్కుల పరిరక్షణ, వివిధ కార్యక్రమాలపై ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి చైర్మన్తో పాటు కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్రావు, డాక్టర్ దోని శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి అన్ని జిల్లాలను సందర్శిస్తూ బాలల సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షిస్తున్నట్లు చెప్పారు. విద్యతోపాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలపై చిన్నారుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. బాల్య వివాహాలపై 1098 చైల్డ్ హెల్ప్లైన్ ద్వారా సమాచారాన్ని అందిస్తే వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ఎస్పీ హుస్సేన్ పీరా, ఐసీడీఎస్ పీడీ విజయతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


