కోడుమూరు రూరల్: మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం కోడుమూరులోని శ్రీవాసవి కల్యాణ మండపంలో మహిళల భద్రత–నేరాల నివారణ మరియు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఏ చిన్న సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలన్నారు. కుటుంబ కలహాలు తలెత్తినప్పుడు పోలీసులను ఆశ్రయిస్తే కౌన్సెలింగ్ ద్వారానే 90శాతం సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం మహిళల రక్షణకు ఏర్పాటు చేసిన ’ఆపరేషన్ దండయాన్’ పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులను, వాలీబాల్ క్రీడలో గెలుపొందిన విద్యార్థులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బాబు ప్రసాద్, కోడుమూరు సీఐ తబ్రేజ్, ఎస్ఐ ఎర్రిస్వామి, సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్, కోడుమూరు ఇంచార్జీ ఎంపీడీఓ క్రిష్ణారెడ్డి, ఎంఈఓ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.


